Description
శ్రీ లలితావిద్య
శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం
More books…Clik….
శ్రీ లలితా విద్య
సహస్రనామ స్తోత్రం అపౌరుషేయం. అపౌరుషేయమని వేదాలకి పేరు. వేదాలు మానవులు సృష్టించినవి కావు. ‘యస్య నిశ్వసితం వేదా?’అని ఉపనిషత్ చెస్తోంది. ఊపిరుల వలె వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయి. వేదాలు పరమాత్మ యొక్క శబ్దరూపములు. అవి పురుష సృష్టి కాదు, జీవసృష్టి కాదు.
అలాగే సహస్రనామాలు కూడా సాక్షాత్తు అమ్మవారి వాగ్రూపాలే వెలికివచ్చి అందించాయి కనుక లలితా సహస్రనామస్తోత్రం సాక్షాత్తు వేదమే. వేదపారాయణా నికి ఎంత శక్తి ఉందో, సహస్రనామ పారాయణకి అంత శక్తి ఉన్నది.
వేదానికి ప్రత్యేకమైన సంస్కారాలు, అధికారాలు చెప్పారు. అన్ని నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం పఠించి అంతటి ఫలితాలు పొందవచ్చును. ఇంత విశేషంగా దీనిని వివరించి “అందుకే దీనికి రహస్యనామస్తోత్రమని పేరు వచ్చింది” అని చెప్పారు హయగ్రీవస్వామి.
బయటికి పేర్లలా కనబడుతున్నా ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు శ్రీవిద్యకి సంబంధించిన మర్మాలు ఉన్నాయి. అంతేకాక యోగశాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర సంకేతాలు ఉన్నాయి. సహస్రనామస్తోత్రం ఒక స్తోత్రగ్రంధమే కాక మహా శాస్త్రగ్రంథం. ఈ స్తోత్రంలో ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంతస్తోత్రం మొదలైన అన్ని శాస్త్రాలు ఉన్నాయి. వ్యాఖ్యానాలతో అన్నీ ఋజువు చేసినవారు ఉన్నారు.
వ్యవహారం కోసం ధర్మశాస్త్రం, ఉపాసన కోసం మంత్రశాస్త్రం, సత్యం తెలుసుకోవడం కోసం తత్త్వశాస్త్రం – ఈ మూడు మనిషికి కావాలి. వ్యవహార జీవితానికి ధర్మం కావాలి. ఈశ్వరుని అనుగ్రహం కోసం మంత్రం, ఉపాసన కావాలి. ఈ మూడు శాస్త్రాలు భగవదనుగ్రహం వలనే లభిస్తాయి. అమ్మవారు ధర్మ, మంత్ర, తత్వాల మూడింటి రూపం.
ఏది గ్రహిస్తే మరేదో తెలుసుకోనక్కరలేదో అలాంటి శాస్త్రం మనకి వశిన్యాది వాగ్దేవతలు అందించారు. నిరంతరం మననం చేసుకోవలసిన గ్రంథమిది. శ్రీదేవ్యాః ప్రీతి విధాయకమ్’ అని శ్రీమాతకి ప్రీతి కలిగించే స్తోత్రమిది. దీనికి విపులమైన, వివరణాత్మకంగా వ్యాఖ్యానించినది శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
సామవేదం షణ్ముఖ శర్మ లలితా సహస్ర నామ స్తోత్రం అనేది ఓ శాస్త్రమని, ఉపాసనా రహస్యాలతో కూడుకున్న ఉపనిషద్విజ్ఞానమన్నారు. అనేక భాష్యాలు, శాస్త్రాలను అధ్యయనం చేసి ‘శ్రీ లలితావిద్య’ను రచించినట్లు పేర్కొన్నారు. పుస్తక రచనకు గురువుల కృపతోనూ, దేవీ ప్రేరణతోనూ స్ఫురించిన భావాలను మేళవించినట్లు తెలిపారు. ధర్మ, భక్తి, జ్ఞాన సంస్కారాలతో అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా టీవీ నారాయణరావు మాట్లాడుతూ ‘శ్రీ లలితావిద్య’ అందుబాటులోకి రావడం తెలుగువారి అదృష్టమని చెప్పారు. లలిత సహస్ర నామాలకు అనేక మంది అనేక భాష్యాలను రచించారని.. లలితా దేవీ వైభవాన్ని వివరించడంలో అవన్నీ వేటికవే ప్రత్యేకమైనవన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రాసిన ‘శ్రీ లలితావిద్య’ విలక్షణమైనదని తెలిపారు. వాగ్దేవతలు పలికిన రహస్య నామాల్లోని గూఢార్థాలు మస్తిష్కంలోకి వెళ్లి, హృదయాలను తాకి, అమ్మవారి భావనలో లీనమయ్యే విధంగా ఈ పుస్తకం ఉందన్నారు.
విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ.. ఈ గ్రంథాన్ని సాక్షాత్తూ లలితా దేవికి అక్షర రూపంగా వర్ణించారు. అమ్మవారి అరుణ ప్రభలు పుస్తకంపై ముఖచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ కనిపిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క నామాన్ని చదువుతూ, భావిస్తూ అమ్మవారి భక్తిలో ఓలలాడవచ్చునన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ గ్రంథం లలితా దేవి చరిత్ర, నామ వైశిష్ట్యంతో అద్భుతంగా ఉందన్నారు. లలితా దేవి రహస్య నామాలలో దాగి ఉన్న శ్రీ విద్య రహస్యాలు సామాన్యుడి నుంచి పండితుల వరకు అర్థం చేసుకునేలా ఉన్నదని పేర్కొన్నారు.